🏠 www.samajahitham.com
Watermark
Newspaper Logo
Date of Publish : 09 September 2026, 3:19 pm Posted by : SAMAJA HITHAM

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి: జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్!

News Image
మెట్‌పల్లి, సెప్టెంబర్ 09 (సమాజహితం): తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత, ప్రతిపక్ష నేతశ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పై అనుచితంగా, అవమానకరంగా వ్యాఖ్యలు చేయడమే కాకుండా ఆయనకు హాని కలిగించేలా ప్రజలను ప్రేరేపించే వ్యాఖ్యలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మరియు బీఆర్ఎస్ నాయకులు మెట్‌పల్లి సీఐ గారికి ఫిర్యాదు చేశారు.

ఇటీవల ఒక మీడియా కార్యక్రమంలో ప్రజా ప్రతినిధిగా ఉన్న వ్యక్తి శ్రీ కేసీఆర్ గారిపై అత్యంత అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ముఖ్యంగా “కేసీఆర్ ఈ రాష్ట్రానికి పట్టిన పీడ.. అందుకే అతని చావును కోరుకుంటున్నాం.. అందుకే వెయ్యి దప్పులతో ర్యాలీ చేస్తున్నాం” అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఆధారాలను కూడా పోలీసులకు అందజేశారు.

ప్రజా జీవితంలో ఉన్న ఒక మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేతపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని వారు అన్నారు. రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా కించపరిచేలా, హాని కలిగించేలా మాట్లాడటం ఏమాత్రం సమర్థనీయం కాదని పేర్కొన్నారు.

ఈ వ్యాఖ్యలు భారతీయ న్యాయ సంహిత (BNS), 2023లోని సంబంధిత సెక్షన్ల కింద నేరపూరిత చర్యలకు దారితీసే అవకాశం ఉన్నందున సెక్షన్లు 196, 351(3), 352, 353, 61 కింద FIR నమోదు చేసి సమగ్ర దర్యాప్తు చేపట్టాలని పోలీసులను కోరారు.

అలాగే ప్రజా ప్రతినిధులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, భవిష్యత్తులో ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ విమర్శలకు హద్దులు ఉండాలని, వ్యక్తిగత దూషణలు, బెదిరింపులు, హింసను ప్రేరేపించే వ్యాఖ్యలను సహించబోమని స్పష్టం చేశారు.

కేసీఆర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు బాధ్యులపై వెంటనే కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు
🏠 Home